అవినీతి బంధువుల సమితి…
-కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు
-ముస్లిం రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం
-బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కామన్ దోస్తులు
-బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామమందిర నిర్మాణం
-సంకల్ప సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

BRS అవినీతి బంధువుల సమితి (భ్రష్టాచార్ రిష్వత్ కోర్ సమితి) అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన బీజేపీ సంకల్ప సభలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొని మాట్లాడారు. ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, బీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్లు తీసుకువచ్చి ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు అన్యాయం చేయాలని చూస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
కేసీఆర్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాల వల్ల తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పేపర్ లీకేజీలు అరికట్టలేని ముఖ్యమంత్రి ఇక రాజ్యపాలన సజావుగా ఏం చేస్తాడని ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ 10 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారని.. 6 లక్షలు ఇచ్చారని.. మిగతావి పూర్తి చేస్తారని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) రహస్య మిత్రులు అని.. వీరి మధ్యలో మరో మిత్రుడు ఉన్నాడని అదే MIM అన్నారు. మోదీ నేతృత్వంలో నడుస్తున్న భారత ప్రభుత్వంపై ఏ దేశం కూడా కన్నెత్తి చూడలేదన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టే రామ మందిరం నిర్మాణం జరుగుతోందన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీఎస్పీ (BSP) అందరి ఎజెండా ఒక్కటే అని చెప్పారు. సొంత రాష్ట్రం యూపీలో బీఎస్పీకి కేవలం ఒక సీటు మాత్రమే ఉందన్నారు. సొంత రాష్ట్రాల్లో చెల్లని బీఎస్పీ తెలంగాణలో చెల్లుతుందా….? అని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. 2017 కంటే ముందు ఉత్తర్ప్రదేశ్లో ఎలా ఉండేదో అందరికీ తెలుసని.. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చాక ఒక్క రోజు కూడా అల్లర్లు జరిగిన సందర్భం లేదన్నారు.