కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల ఆందోళన
The continuing concern of junior doctors

RIMS: ఆదిలాబాద్ రిమ్స్లో వైద్యవిద్యార్థులపై దాడి వ్యవహారంలో జూనియర్ డాక్టర్లు తమ ఆందోళన రెండో రోజు సైతం కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనకు సంబంధించి విచారణ కమిటీ రంగంలోకి దిగింది. శుక్రవారం దాడి ఘటన జరిగి రెండో రోజు కాగా, విధులకు దూరంగా ఉంటున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలకు హజరు కామని వారు వెల్లడించారు. అయితే, ఇప్పటికే వైద్య విద్యార్థుల పై దాడి చేసిన వారిలో పోలీసులు ఐదుగురిని రిమాండ్ పంపించారు. డైరెక్టర్ పైనా కేసు నమోదు చేశారు. రౌడీ షీటర్ ల తో రిమ్స్ హాస్టల్స్ ఆవరణ లోకి వెళ్ళి దాడి చేయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కుమార్ ను ఉన్నతాధికారులు టర్మినేట్ చేశారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జై సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
రిమ్స్ మెడికోల పై దాడికి సంబంధించి విచారణ కమిటీ రంగంలోకి దిగింది. డీఎంఈ ఆదేశాల తో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రొఫెసర్లు శివ ప్రసాద్ , వివి రావ్ బృందం రిమ్స్ కు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెడికోలపై దాడికి సంబంధించి డీఎంఈ ఆదేశాలతో ఇక్కడకు వచ్చామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తామని ప్రకటించారు. రిమ్స్ మెడికల్ కాలేజీ హాస్టల్స్ లోకి బయట వ్యక్తులు ఎందుకు వచ్చారు…? వైద్య విద్యార్ధుల పై దాడి.. దానిని ప్రోత్సహించింది ఎవరు….? ఎవరి ప్రమేయం ఎంత ఉంది…? అనేది అందరితో మాట్లాడి నివేదిక సిద్ధం చేస్తామని వారు స్పష్టం చేశారు. ఒక్కటి రెండు రోజుల్లో నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు.