నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు
సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహించి అన్ఫిట్ అయిన కార్మికుల పిల్లలకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మాదారం సివిల్ డిపార్ట్ మెంట్లో టీబీజీకేఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇన్చార్జీ దుర్గం అశోక్ కుమార్, పిట్ సెక్రటరీ గుజ్జ శ్రీనివాస్ మాట్లాడుతూ కారుణ్య నియామాకాల్లో కావాలనే కార్మికులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణికి విద్యుత్తు పరిశ్రమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు రూ.54వేల కోట్ల బకాయిలు ఉన్నాయని, అవి చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని ధ్వజమెత్తారు. కార్మికులకు జీతాలు చెల్లించడం కష్టంగా మారిందన్నారు. కార్యక్రమంలో నాయకులు కోగిలాల రవీందర్, ఉస్మాన్, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు.