తెల్లకల్లు తాగేందుకు నకిలీ నోట్లు

ఆదిలాబాద్ నేరడిగొండ మండల కేంద్రంలో నకిలీ నోట్లు కలకలం సృష్టించాయి. కొన్ని చోట్ల ఈ నకిలీ నోట్లు వెలుగుచూడటం వ్యాపారులను, ప్రజలను కలవరపెట్టింది. నేరడిగొండ మండల కేంద్రంలోని తెల్లకల్లు దుకాణంలో రూ.500 నోటును ఇచ్చి, ఓ వ్యక్తి కల్లు తాగినట్లు యజమాని సంతోష్గౌడ్ తెలిపారు. ఇటీవల మద్యం దుకాణంలో సైతం రూ.500, రూ.100ల నకిలీ నోట్లను గుర్తించినట్లు నిర్వాహకులు తెలిపారు. విద్యుత్తు బిల్లుల వసూళ్లలో సైతం మండల కేంద్రంలో రూ.100, రూ.50 నకిలీ నోట్లను గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. నకిలీ కరెన్సీ నోట్లు ఒక్కొక్కటిగా బయటపడటం పట్ల మండలవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ నోట్ల వ్యవహారాన్ని అధికారులు ఆదిలోనే గుర్తించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.