ఇంధన్పల్లి ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్
జన్నారం మండలంలోని ఇందన్పల్లి అటవీ రేంజ్ అధికారి లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాగులో చేపల వేటకు వెళ్లారనే కారణంతో ఐదుగురు గిరిజన యువకులను దుర్భాషలాడుతూ, లాఠీతో కొట్టారు. కాళ్లు మొక్కుతాం సర్ అన్నా కనికరించకుండా లాఠీతో కొట్టారు. తమతో అవమానకరంగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేపల వేటకు వెళ్తే లాఠీలతో కొట్టడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం ఘాటుగా స్పందించారు. దీనిపై విచారణ చేసిన ఉన్నత అధికారులు లక్ష్మీనారాయణను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.